AP Liquor Scam: లిక్కర్ స్కాం నిందితులకు మరోసారి బిగ్ షాక్
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:33 PM
AP Liquor Scam: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో నిందితులకు మరోసారి ఎదురుదెబ్బే తగిలింది. ఈ కేసులో ఏడుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అమరావతి, జూన్ 3: ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసులో నిందితుల రిమాండ్ను విజయవాడ కోర్టు (Vijyawada Court) పొడిగించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల రిమాండ్ ఈరోజుతో (మంగళవారం) ముగిసింది. దీంతో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి, చాణక్య, దిలీప్, ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఏడుగురు నిందితులకు ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంత మంది అవసరమా.. జడ్జి కీలక వ్యాఖ్యలు
అయితే లిక్కర్ కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు సమయంలో సీబీఐ కోర్టు న్యాయాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. రిమాండ్ పొడిగింపునకు ఇంతమంది అవసరమా అంటూ డిఫెన్స్ న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టుకు వచ్చిన నిందితుల కోసం వారి కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు తరలివచ్చారు. నిందితులను కోర్టులో హాజరుపరచగానే వీరంతా కూడా లోపలకు ప్రవేశించారు. ఈ క్రమంలో న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. సాఫీగా రిమాండ్ పొడిగింపు జరిగే దాని కోసం ఇంత హడావిడి అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇదే జరిగితే ఇప్పటి వరకు తెరిచి ఉన్న తలుపులు మూసుకుపోతాయంటూ సీబీఐ కోర్టు న్యాయాధికారి వ్యాఖ్యానించారు.
ఇక.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను కూడా పలు దఫాలుగా కస్టడీలోకి తీసుకుని విచారించింది సిట్. ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదట వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు సిట్ అధికారులు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహింతంగా వెలిగిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ ముగ్గురితో పాటు మరోసారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇందుకు కోర్టుకు కూడా అనుమతించింది. నలుగురు నిందితులను రెండు రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని పలు దఫాలుగా విచారించారు.
ఈ నలుగురు చుట్టూనే మద్యం వ్యవహారం మొత్తం నడిచినట్లు ఇప్పటికే సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎలా విచారణ చేసినా, ఏ వైపు నుంచి మొదలు పెట్టినా కూడా మద్యం కుంభకోణంలో ప్రధానంగా వీరి పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు. వీరి వెనక ఉన్న అసలు బాస్ ఎవరున్నారనే దానిపై నిర్ధారణకు వచ్చిన సిట్... అతనికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరో వారం పది రోజుల్లోనే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మరిన్ని అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరి రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపర్చగా.. 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ ఏడుగురు నిందితులను సిట్ అధికారులు తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి
రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News